తెలంగాణ పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి ఆగ్రహం

  • అధికార పార్టీకో న్యాయం.. విపక్షాలకో న్యాయమా?
  • ధర్నాచౌక్ లో కేసీఆర్ ధర్నా చేయలేదా?
  • ప్రభుత్వమే భావప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం
పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, విపక్షాలకు మరో న్యాయమా? అంటూ పోలీసుల తీరును తప్పుబట్టారు. టీఆర్ఎస్ ధర్నాలను పోలీసులు ఎందుకు అడ్డుకోవట్లేదని ప్రశ్నించారు.

 ఇవాళ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఎర్రవల్లికి వెళ్లకుండా రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో పాటు రచ్చబండ కోసం ఎర్రవల్లికి వస్తున్న కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో భట్టి ఆగ్రహం వ్యక్తంచేశారు.

పోలీస్ నిర్బంధాలతో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. రైతుల సమస్యలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేస్తే అడ్డుకుంటారా? అని మండిపడ్డారు. ప్రభుత్వమే భావప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని విమర్శించారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ లో కేసీఆర్ ధర్నా చేయలేదా? అని ప్రశ్నించారు.

Telangana
Congress
Mallu Bhatti Vikramarka
TPCC President
Revanth Reddy

More Telugu News